మల్లెపల్లి లక్ష్మయ్య
అక్రమంగా అసైన్డ్భూములను కలిగివున్నవారికి వాటిని క్రమబద్ధీకరించరాదని ఈ నెల ఒకటవ తేదీన రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టానికి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన సవరణను వ్యతిరేకిస్తూ, అది రాజ్యాంగపరంగా చెల్లదని, అంతేగాక ఈ సవరణ చట్టం మౌలిక స్వభావానికి విరుద్ధమని ప్రముఖ న్యాయవాది బొజ్జా తార కం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు అనుమతిస్తూ హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఇలా ఉంటే, అక్రమంగా ఆధీనంలో ఉంచుకున్న అసైన్డ్ భూములను ఎవరికివారుగా అప్పగిస్తే ఎటువంటి శిక్షలు ఉండవని విధించిన గడుపు ఏప్రిల్ 29వ తేదీతో ముగిసింది. కానీ ఎవ్వరూకూడా అప్పగించిన దాఖలాలు లేవు. అయితే రాష్ట్ర రెవెన్యూ అధికారులు ఎవరి దగ్గర ఎంత అసైన్డ్ భూమి ఉన్నదనే వివరాలను సేకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలకే పరిమితమైతే కొంత ఆశ కలుగకమానదు. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.